ముంబయి,19 ఆగస్టు (హి.స.) ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా ముంబైను వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. సాధ్యమైన మేరకు ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని అధికారులు సూచించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
