విజయవాడ, 19 ఆగస్టు (హి.స.)విజయవాడ వద్ద కృష్ణానదికి వరద (Krishna Floods) పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఇన్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విపత్తు నిర్వహణ సంస్థ లంక గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయనున్న క్రమంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని, అలాగే ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) వరద పెరుగుతుండటంతో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి.. 3,70,158 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3,73,024 క్యూసెక్కులు ఉండగా.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
