శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 3 : అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ కోరారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా అన్సారియాలతో కలిసి జిల్లా అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల విధులు ఉంటాయన్నారు. ప్రస్తుతం శాఖా పరమైన పనులు ఉంటాయన్నారు. అందరూ చురుకుగా ఉంటూ పని చేయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు. శాఖా పరమైన విధులతో పాటు రానున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సంసిద్ధతతో ఉండాలన్నారు.
సిబ్బందిని అప్రమత్తతో పనిచేయించాలని, అంతా కలిసి ఒక టీంగా పని చేయాలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్నికలు జరుగనున్న సందర్భంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.
