విజయవాడ, 03 జనవరి (హి.స.)
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం అధికారులు.. అమ్మవారి దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చేవారు కూడా తప్పనిసరిగా దర్శనం టికెట్లను కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. అమ్మవారి హుండీ ఆదాయం, ఆలయ నిర్వహణ నిధులను పెంచేందుకే నిబంధనను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం నుంచి గురువారం వరకూ 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటుండగా.. శుక్ర, శని, ఆదివారాల్లో 50 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని పేర్కొన్నారు. వారిలో సుమారు 300 మంది వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలతో ఆలయానికి వస్తున్నారని, వారంతా టికెట్ కొనకుండానే దర్శనం చేసుకుంటున్నారని ఆలయ ఈఓ శీనా నాయక్ దృష్టికి వచ్చింది. ఇంకొందరు ప్రొటోకాల్ పేరుతో టికెట్ లేకుండా దర్శనాలు చేసుకుంటారని తెలియడంతో.. ఆలయ ఆదాయానికి గండిపడుతున్నట్లు గుర్తించారు. అమ్మవారి దర్శనాల్లో ఈ విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు .. ధర్మకర్తల మండలి సమావేశంలో వీఐపీ, వీవీఐపీ దర్శనం చేసుకునేవారు సైతం టికెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇకపై సిఫారసు లేఖలతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
