అమరావతి, 18 ఆగస్టు (హి.స.) :’అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత ఉండీ, లబ్ధి పొందని రైతులు ఈనెల 20వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. అర్హతను నిర్ధారించడంలో ఉన్నత స్థాయి పరిశీలన, ధ్రువీకరణలో తిరస్కరణకు గురైన రైతులు, పథకానికి అర్హులైనా ఈ-కేవైసీ చేసుకోక తిరస్కరణకు లోనైన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి, ’అన్నదాత సుఖీభవ’ పోర్టల్లో తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు. జూలై 27వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో అర్హులను గుర్తించి, నిధులు జమ చేసినట్లు తెలిపారు. రెండో అవకాశంగా ఈనెల 20 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
