
ఢిల్లీ, 8 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ విశ్లేషణను ‘అర్థం పర్థం లేనిది’గా అభివర్ణించిన ఈసీ, ఆయన తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేనిపక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని శుక్రవారం సవాల్ విసిరింది.
గురువారం సాయంత్రం జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ, 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తమ సర్వేలో ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండటం, ఉనికిలో లేని చిరునామాలు, ఒకే ఇంటి నంబర్పై వందలాది ఓట్లు, ఫొటోలు సరిగా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం వంటి అనేక అవకతవకలను గుర్తించినట్లు ఆయన వివరించారు.
అంతేకాకుండా, అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన అనర్హుల జాబితాను ఎందుకు సమర్పించడం లేదని బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. ఆయన ఆధారాలు సమర్పించడంలో విఫలమైతే, ఇదంతా కేవలం రాజకీయ నాటకమని స్పష్టమవుతుంది. ప్రజల మనసుల్లో సందేహాలు రేకెత్తించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు అని మాలవీయ విమర్శించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
