

కాకినాడ 25 డిసెంబర్ (హిం.స): గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేసి సర్పంచులకు అధికారాలు అప్పగించాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన కాకినాడలో ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర శ్రీనివాస్, వై.వినోద్రాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు నాగబత్తుల శాంతకుమారితో కలసి విలేకర్లతో మాట్లాడారు.
పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి.. విద్యుత్తు బకాయిలు, ఇతర ఖర్చులకు సర్దుబాటు చేయడాన్ని నిరసిస్తూ జనవరి 1 నుంచి సర్పంచుల ఆధ్వర్యంలో ‘సమర శంఖారావం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు రూ.30 వేలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలన్నారు.
12,918 మంది సర్పంచులతో కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి పంచాయతీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
