న్యూఢిల్లీ: ఏప్రిల్సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈనెల 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 134 మంది అనగా ఎనిమిది శాతం అభ్యర్థులు మాత్రమే మహిళలు ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 9 శాతం (726) మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో 78 మంది మాత్రమే 17వ లోక్సభకు ఎంపికయ్యారు.
2023 సెప్టెంబరులో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయాలనే బిల్లును ఆమోదించినప్పటికీ, రాజకీయ పార్టీలు ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టడానికి సిద్ధపడటం లేదని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తుంది. మణిపూర్, నాగాలాండ్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో లేకపోవడం విశేషం. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఒక మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టారు. బీహార్ 3, మధ్యప్రదేశ్ 7,మహారాష్ట్ర 7, మేఘాలయ 2, పుదుచ్చేరి 3, రాజస్థాన్ 12, సిక్కిం 1, ఉత్తరప్రదేశ్ 7, ఉత్తరాఖండ్ 4, పశ్చిమ బెంగాల్లో నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల మొదటి దశలో తమిళనాడులో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. కాగా ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1618 మందిలో 28 మంది నిరక్షరాస్యులు, 255 మంది గ్రాడ్యుయేట్లు, 309 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 47 మంది డాక్టరేట్లు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.
