దిల్లీ 13, అక్టోబర్ : ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ‘ఆపరేషన్ అజయ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా భారతీయుల్ని తీసుకుని టెల్ అవీవ్ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకుంది. యుద్ధ కల్లోలం నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత పౌరులకు దిల్లీ ఎయిర్పోర్టులో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా హత్తుకున్నారు. తొలి బ్యాచ్లో మొత్తం 212 మంది భారతీయులను వెనక్కి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ ఆధారంగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చారు.
