ఢిల్లీ, 19 జనవరి (హిం.స)
: ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ కు మళ్లీ పెరోల్ మంజూరైంది. హరియాణాలోని రోహ్తక్ సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న అతనికి 50 రోజులపాటు పెరోల్ మంజూరు చేస్తు అక్కడి కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
అతని తల్లి అనారోగ్యం కారణంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డేరా బాబాకు పెరోల్ మంజూరు కావడం ఇది తొలిసారేమీ కాదు. 2023 నవంబర్లో కూడా అతను పెరోల్పై బయటకి వచ్చాడు. 2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2002లో జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి, డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసు విచారణలో డేరానే దారుణాలకు ఒడిగట్టాడని విచారణలో తేలింది.
రెండు హత్య కేసుల్లో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే ఏదో ఒక కారణంతో అతనికి గతేడాది మూడుసార్లు పెరోల్ మంజూరు కావడం గమనార్హం. తల్లి అనారోగ్యం తదితర కారణాలను సాకుగా చెబుతూ తరచూ పెరోల్పై బయటకి వస్తున్నాడు. హరియాణా జైలు నిబంధనల ప్రకారం.. జైలు శిక్ష పడిన ఏ ఖైదీ అయినా ఏడాదిలో 70 రోజులు పెరోల్పై బయటకి రావచ్చని అధికారులు చెబుతున్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
