ఢీల్లీ, 3 జనవరి (హిం.స) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ గొంతు తగ్గించుకోండి’ అంటూ హెచ్చరించారు. ఒక పిటిషన్ లిస్టింగ్ విషయంలో జరిగిన వాదనల్లో జడ్జి ఈ మేరకు అరుదైన రీతిలో తీవ్రంగా స్పందించారు. న్యాయవాది గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడంపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టుపై కోప్పడం మానుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యాయవాదితో జరిగిన వాగ్వాదంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తిగా కనిపించారు. లాయర్ వినమ్రంగా మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన ఊరుకోలేదు. ‘‘ ఒక సెకండ్. మీ గొంతు తగ్గించుకోండి. భారత ప్రప్రథమ కోర్టు ముందు మీరు వాగ్వాదం చేస్తున్నారు. స్వరం తగ్గించండి. లేదంటే కోర్టు నుంచి మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుంది’’ అని సీజే ప్రకటించారు. ‘‘ మామూలుగా మీరు ఎక్కడ కనిపిస్తుంటారు? ప్రతిసారి జడ్జిల మీద ఇలాగే అరుస్తుంటారా?’’ అని న్యాయవాదిని ప్రశ్నించారు. కోర్టు రూమ్లో హుందా ఉండాల్సిన అవశ్యకతను గుర్తుచేశారు. ‘‘ దయచేసి మీ గొంతు తగ్గించుకోండి. స్వరం పెంచి కోర్టు మీద కోప్పడొచ్చని అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. గత 23 ఏళ్లలో ఈ విధంగా జరగలేదు. నా కెరియర్లో చివరి ఏడాది ఇలా జరగబోదు’’ అని డీవై చంద్రచూడ్ అన్నారు.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
