ఖమ్మం, 30 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం అర్బన్- రూరల్ మండలాల మధ్య ఉన్న మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఎగువ జిల్లాలైన మహబుబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో క్రమ క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 12 గంటల వరకు కూడా 18 అడుగుల వద్ద ఉన్న మున్నేరు అర్ధరాత్రి 12 గంటలకు 21 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మోతి నగర్ ప్రాంతాల ప్రజలను ప్రత్యేక వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి వేళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్, కె.వి.ఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, కరుణగిరి ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు
