నంద్యాల , 18 ఆగస్టు (హి.స.): జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఈ రోజు సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులుదీరారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా స్వామి, అమ్మవార్ల దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. భక్తుల శివనామ స్మరణతో శ్రీగిరులు మార్మోగాయి. ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు ఉచిత ప్రసాద వితరణ, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
