ఢిల్లీ, 01 జనవరి (హి.స.)ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో భారత్, పాకిస్థాన్ల మధ్య శాంతిని నెలకొల్పడానికి తాము (చైనా) మధ్యవర్తిత్వం (Mediation) వహించామని చైనా విదేశాంగ మంత్రి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. చైనా (China) చేస్తున్న ఇటువంటి మధ్యవర్తిత్వ వాదనలు భారత దేశ సార్వభౌమత్వానికి (Sovereignty of India), గౌరవానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, వీటిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి రావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అది దేశ గౌరవాన్ని పణంగా పెట్టి జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై చైనా చేస్తున్న ఇటువంటి అధికారిక ప్రకటనల పట్ల కేంద్ర ప్రభుత్వం మౌనం వహించకుండా భారత దేశ స్వతంత్ర వైఖరిని చాటిచెప్పాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదికగా కోరారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
