ముంబై, 31 డిసెంబర్ (హిం.స)
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో అయోధ్య ధాం రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టును ప్రారంభించారు ప్రధాని మోదీ.
అయితే జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. అయితే, తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడు కాబట్టి, తనకు ఆహ్వానం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు.
తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అయోధ్యను చాలా సార్లు సందర్శించానన్న విషయాన్ని గుర్తుచేశారు. బాబ్రీ మసీదు ఘటనపై కూడా స్పందించారు ఠాక్రే. తన తండ్రి బాల్ ఠాక్రే బాబ్రీ మసీదు ఘటనలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని తెలిపారు. తన తండ్రితో పాటూ మరో 109 మంది శివసైనికులు ఉన్నారని వెల్లడించారు. రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1990 ఎన్నికల సమయంలో రామ మందిరంతో పాటు హిందుత్వపై ప్రచారం చేసినందుకు తన తండ్రి బాల్ ఠాక్రే ఓటుహక్కును కోల్పోవల్సి వచ్చిందని తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల్లో ప్రస్తావించినందుకు ఈసీ ఓటు హక్కును నిషేధం విధించిందన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
