ఢిల్లీ, 18 నవంబర్ (హి.స.) ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనపై NIA అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ పేలుడు వెనుక జైషే ఉగ్రవాద మాడ్యూల్ ఉందని గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు ఉగ్రడాక్టర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. జామియానగర్ లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది. యూనివర్సిటీకి అందుతోన్న నిధులు, మళ్లుతున్న నిధులపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు నిర్వహించింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు వర్సిటీ నిధుల మళ్లింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. వర్సిటీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు.. మరో 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాగా.. ఢిల్లీలోని చాందినీ చౌక్ మెట్రోస్టేషన్ వద్ద ఇటీవల జరిగిన కారు బాంబు దాడి ఘటనలో ఇప్పటి వరకూ 15 మంది మరణించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
