2025 సెప్టెంబర్ మొదటి వారంలో, ప్రపంచం మొత్తం దృష్టి న్యూఢిల్లీపై ఉంది. అక్కడ యశోభూమి – అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ సాంకేతికత, ఆత్మవిశ్వాసం మరియు ప్రపంచ సహకారానికి కేంద్రబిందువుగా మారింది. సెమీకాన్ ఇండియా 2025 అనేది కేవలం మరో పరిశ్రమ సమావేశం కాదు. ఇది ఒక సంకల్ప ప్రకటన. భారత్ ఇకపై ఆధునిక సాంకేతికత వినియోగదారుడిగా మాత్రమే కాకుండా – సృష్టికర్తగా, తయారీదారుడిగా మరియు నమ్మదగిన భాగస్వామిగా సెమికండక్టర్ విప్లవంలో ముందుకు వెళ్ళబోతోందని ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది.
ఈ కార్యక్రమం స్థాయే ఆ ఆశయాన్ని తెలియజేస్తుంది. 20,000 మందికి పైగా ప్రతినిధులు, 30కి పైగా దేశాలు, 350కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వర్క్షాప్లు, ప్యానెల్ చర్చలు, ఫైర్సైడ్ చాట్స్, రౌండ్ టేబుల్ సమావేశాలలో సెమికండక్టర్ సరఫరా శృంఖలలోని ప్రముఖ మేధావులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు యువ నిపుణులు అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి నడుస్తూ, భారత సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మలుపు తాము వీక్షిస్తున్నామనే భావనతో ఉన్నారు.
ప్రజల ఊహాశక్తిని ఆకర్షించిన ముఖ్య ఘట్టం భారత తొలి స్వదేశీ స్పేస్-రెడీ చిప్ “విక్రం” ఆవిష్కరణ. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ డిజైన్ చేసి, మోహాలీలోని ISRO సెమికండక్టర్ ల్యాబొరేటరీలో తయారు చేసిన ఈ 32-బిట్ ప్రాసెసర్ కేవలం సాంకేతిక విజయమే కాదు. ఇది భారత్ తన ఉపగ్రహాలు, రాకెట్లు, రక్షణ వ్యవస్థలు, ఆధునిక వాహనాలు, శక్తి మౌలిక వసతుల కోసం స్వయంగా ప్రాసెసర్లు తయారు చేయగలదనే విశ్వాసానికి ప్రతీక. ఇప్పటి వరకు ఈ సామర్థ్యం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉండేది. విక్రంతో భారత్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో సృష్టికర్తగా యోగదానం చేయగలదని ప్రకటించింది.
అలాగే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వరకు సెమికండక్టర్ చర్చల్లో పెద్దగా ప్రాధాన్యం పొందని ఆసామ్ రాష్ట్రం ఈ సారి ప్రధానంగా నిలిచింది. ఆసాంలో తయారు చేసిన రెండు చిప్లు ప్రదర్శించబడ్డాయి. ఒకటి టాటా OSAT చిప్ (జగిరోడ్) – ఇది రోజుకు లక్షల చిప్ల ప్యాకేజింగ్, టెస్టింగ్ చేయగల సామర్థ్యం కలిగిన కేంద్రంలో తయారైంది. మరొకటి న్యూరల్ అంపైఫైర్ ఫ్రంట్ ఎండ్ IC (NIT సిల్చర్) – ఇది మెదడు సంకేతాలను పెంచి బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్ మరియు ఆధునిక వైద్య ఉపయోగాల కోసం ఉపయోగపడుతుంది. దీని ద్వారా భారత్లోని సెమికండక్టర్ ఆవిష్కరణ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని స్పష్టమవుతోంది.
తయారీ రంగంలో గుజరాత్ కీలక కేంద్రమైంది. సాణంద్లో CG-Semi ఆధ్వర్యంలో కొత్త OSAT పైలట్ లైన్ ప్రారంభమైంది. ఇది భారత ఫాబ్లెస్ డిజైన్ కంపెనీలకు ప్రపంచ స్థాయి అసెంబ్లీ మరియు టెస్టింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే ప్రభుత్వం డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) పథకంలో 23 చిప్ డిజైన్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. ₹76,000 కోట్లకుపైగా ఉన్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకంతో కలిపి, భారత్ ఇప్పుడు నిజమైన సెమికండక్టర్ ఎకోసిస్టమ్ కోసం ఆర్థిక మరియు విధాన పునాది వేస్తోంది.
సెమీకాన్ ఇండియా 2025లో విద్యా సహకారం కూడా ప్రధాన అంశమైంది. న్యూయార్క్లోని ఆల్బనీ విశ్వవిద్యాలయం మరియు బెంగళూరులోని రమయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ మధ్య కొత్త భాగస్వామ్యం ప్రకటించబడింది. 2026 జనవరి నుంచి భారత విద్యార్థులు సెమికండక్టర్ తయారీ, మెట్రాలజీ రంగాలలో ప్రత్యేక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయవచ్చు. ఇది మౌలిక వసతులు, విధానాలు ఎంత ముఖ్యమో, మానవ వనరులు అంతకంటే ముఖ్యమని ప్రతిబింబిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి శుభారంభం చేస్తూ సెమికండక్టర్లను 21వ శతాబ్దపు డిజిటల్ వజ్రాలు అని పేర్కొన్నారు. భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, మొత్తం సెమికండక్టర్ విలువ శృంఖలలో నాయకత్వం వహించడమే లక్ష్యం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత దేశీయ డిమాండ్ సుమారు 45–50 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి అది 100 బిలియన్ డాలర్లను దాటనుంది. ప్రపంచ స్థాయిలో ఈ మార్కెట్ ఈ దశాబ్దంలో ట్రిలియన్ డాలర్లకు చేరనుంది.
ప్రపంచ ధోరణులు గమనిస్తే మరింత స్పష్టత వస్తుంది. తైవాన్ ఇప్పటికీ తయారీ కేంద్రంగా ఉంది (TSMC వంటి కంపెనీలతో), దక్షిణ కొరియా మెమరీ చిప్లలో అగ్రగామి (సామ్సంగ్ వంటి దిగ్గజాలతో), అమెరికా డిజైన్లో ఆధిపత్యం కలిగి ఉంది (Intel, NVIDIA, Qualcomm), యూరప్ తన చిప్స్ యాక్ట్ ప్రారంభించింది. చాలా కాలంగా దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ సరఫరా గొలుసులో నమ్మదగిన భాగస్వామిగా అవతరిస్తోంది.
భారత్ యొక్క నిజమైన బలం దాని ప్రతిభావంతులైన మానవ వనరులు. ప్రతి సంవత్సరం లక్షలాది ఇంజనీర్లు భారత విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులవుతారు. వారిలో చాలా మంది ఇప్పటికే సిలికాన్ వ్యాలీ, తైవాన్, యూరప్లలోని సెమికండక్టర్ కంపెనీలలో తమ ముద్ర వేశారు. సెమీకాన్ ఇండియా ఆ ప్రతిభను దేశంలోనే నిలిపి, ఇక్కడే నాణ్యమైన ఉద్యోగాలు, స్టార్టప్స్, పరిశోధన అవకాశాలు సృష్టించాలనే ప్రయత్నం.
భారత యువతకు అవకాశాలు అమోఘం. కొత్త ఫాబ్రికేషన్, డిజైన్ హబ్లు వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తాయి. AI, ఎలక్ట్రిక్ వాహనాలు, హెల్త్కేర్ కోసం చిప్లను డిజైన్ చేస్తున్న స్టార్టప్లకు ఇప్పుడు DLI పథకం కింద నిధులు, మెంటర్షిప్ అందుతోంది. అంతర్జాతీయ అకాడమిక్ భాగస్వామ్యాలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రయోగశాలల అవకాశాలు కల్పిస్తున్నాయి. వర్క్ఫోర్స్ డెవలప్మెంట్ పావిలియన్ విద్యార్థులకు పరిశ్రమ నిపుణుల నుండి కెరీర్ మార్గదర్శనం, వర్క్షాపులు అందిస్తోంది.
ప్రత్యక్షంగా సమావేశానికి హాజరు కాలేని వారికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. IITs, IISc మరియు ఇతర విశ్వవిద్యాలయాలు VLSI డిజైన్, సెమికండక్టర్ టెక్నాలజీ కోర్సులు అందిస్తున్నాయి. రమయ్య–ఆల్బనీ భాగస్వామ్యం త్వరలో అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్లు జోడించనుంది. ప్రభుత్వ నైపుణ్య ప్లాట్ఫార్మ్లపై చిప్ డిజైన్, టెస్టింగ్ ప్రాథమిక కోర్సులు ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. గుజరాత్, ఆసామ్లలో కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేసిన పెద్ద కంపెనీలు ఇంటర్న్షిప్లు ప్రారంభించబోతున్నాయి. కోర్సెరా, edX వంటి అంతర్జాతీయ వేదికలు చవక ధరలో అత్యున్నత విద్యను అందిస్తున్నాయి.
తీర్మానం స్పష్టంగా ఉంది – భారత్ ప్రపంచంలోని అతిపెద్ద చిప్ దిగుమతి దారులలో ఒకటిగా ఉండటానికి బదులు ఇప్పుడు ఒక ప్రధాన ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా మారుతోంది. ప్రభుత్వం విధానాలు, ఆర్థిక ప్రోత్సాహాలు అందించింది. పరిశ్రమ పెట్టుబడులు పెట్టింది. విశ్వవిద్యాలయాలు ప్రతిభను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని పట్టుకోవడం యువత చేతిలో ఉంది.
సెమీకాన్ ఇండియా 2025 ఆ దృశ్యాన్ని స్పష్టంగా చూపించింది. మేడ్ ఇన్ ఇండియా చిప్లు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఉపగ్రహాలు, వైద్య పరికరాలకు శక్తినిచ్చే రోజులు ఇప్పుడు కల కాదు – వేగంగా వాస్తవంగా మారుతున్నాయి. ఈ ఉత్సాహం కొనసాగితే భవిష్యత్ డిజిటల్ వజ్రాలు భారత్ నుండే అత్యంత ప్రకాశిస్తాయి.
